వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా … “నాకు వేడి చేసిందని” ,” నాది వేడి శరీరమని” , వేడి చేసే ఆహారాలు , చలువ చేసే ఆహారాలు, ఐస్ తింటే వేడి చేస్తుందని ఇలా రకరకాలుగా వింటుంటాం.నిజానికి ఇవన్నీ అపోహలంటే నమ్మబుద్ధి కాదు . ఎందుకంటే ఈ మాటలు మనల్ని నిజమని నమ్మేంతగా ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి మన శరీరపు ఉష్ణోగ్రత 37 C డిగ్రీలుగా (98.7 F ) ఒకే రీతిగా ఉంచబడుతుంది. మనం కాఫీ లాంటి వేడిగా ఉండేవి తీసుకొన్నప్పుడు చమట రూపంలో మన శరీరం చల్లపరచ బడుతుంది . ఇలాగా ఎప్పటికప్పుడు మన శరీరాన్ని చమట రూపం లో మరీ ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చమట పోసి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక చలికాలం లోనయితే వనకడం ద్వార శరీరం వేడి పుట్టించి శరీర ఉష్ణోగ్రత ఒకేలా (37 C ) ఉంచుతుంది. మరి ఈ వేడి చేయటమేమిటి ? కొన్ని ఆరోగ్య సంభదమయిన సమస్యలే ఇవి! ఉదాహరణ కు మన శరీరం మీద వేడి గుల్లలు (ఉడుకుగుల్లలు) అని చిన్న చిన్న పుండ్లు వస్తుంటాయి. ఇవి నిజానికి స్టెఫలోకోకాస్ అనే బాక్టీరియా వల్ల వస్తాయి. కాని ఇవి వేడి చేయటం వలన వస్తాయని తరతరాలుగా ( అంటే బాక్టీరియా ను కనిపెట్టక ముందునుండి ) అపోహ . అలాగే మూత్రం పోసుకొనేటప్పుడు మంటగా ఉండటం వేడి వల్లనే అని అపోహ. కాని మూత్రనాళం లో ఇన్ఫెక్షన్ వల్లనో లేక నీరు తక్కువ త్రాగటం వల్లనో వస్తుందని ఇప్పుడు తెలుసు. అలాగే కడుపులో అమీబియాసిస్ లాంటి వ్యాధులున్నప్పుడు అక్కడ ఎక్కువగా వేడి ఉత్పన్నమవుతుంది . అది చెమట రూపంలో బయట పడుతుంది.అంతేకాని నిజానికి వేడి చేయటం అంటూలేదు. అలాగే ఆహార పదార్థాల విషయం లో కూడా.